Wednesday, July 16, 2014

గురుపూర్ణిమ గురించి మీకు తెలీదని కాదు. ఇది పోయిన ఆదివారం ఆంధ్రభూమి వీక్లీలో వచ్చిన నా వ్యాసం.


గురుపూర్ణిమ

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః"

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. సాక్షాత్తూ  పరబ్రహ్మ ఆయనే. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను.

"గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః"

 

భవ రోగాలను తొలగించేవాడు, సకల విద్యానిధీ, సకల లోకాలకూ గురువు దక్షిణామూర్తి. ఆయనకు న నమస్కారం.

ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లీ తండ్రీ దైవం - అన్నీ తామే అయ్యేవారు గురువులు.  విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఆచార్యులవారిని అంటే గురుదేవుని త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలి. ఇది ఋషివచనం.

"మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అన్నది ఆర్యోక్తి.  తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తల్లి తరువాతే తండ్రి.  అదీ మన సంస్కృతి.

తెలిసో తెలియకో దైవానికి అపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం తెప్పిస్తే ముల్లోకాలలో ఆ త్రిమూర్తులతో సహా ఎవరూ రక్షించలేరు. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొందాలి.  అదే గురు పూర్ణిమ సందేశం.

"గురువునూ, గోవిందుడిని పక్క పక్కన నిలబెట్టి, ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే,  గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీరు.  

అసలు "గురు"వు అనే పదంలో   "గు" అంటే "తమస్సు" లేదా "చీకటి" లేదా "అజ్ఞానం",  "రు" అంటే "  తొలగించు" అని అర్థం.  మనలోని అజ్ఞానాన్ని తొలగించి తన జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు "గురువు".  బ్రహ్మలాగా మనలో జ్ఞాన బీజాన్ని సృష్టించి, విష్ణువులాగా దాని స్థితిని కొనసాగించి, మహేశ్వరుడిలాగా  అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. 

పూర్వకాలంలో శిష్యులూ, గురువులు కూడా ఈ నాలుగుమాసాలూ వర్షాకాలం కావడంతో, వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి, ఎలాటి  దేశసంచారమూ చేయకుండా ఒకేచోటే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు. ఆషాడ పూర్ణిమ నుండి నాలుగు మాసాలు(చాతుర్మాసం) ఒక వ్రతంగా పాటించేవారు. అదే చాతుర్మాస్య వ్రతంగా పేరు పొందింది. ఆ సమయంలో శిష్యులు గురువు దగ్గర జ్ఞాన సముపార్జన చేసేవారు. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు  గురువును ఆరాధించడానికి కేటాయించేవారు. ఆ సంప్రదాయమే కాలక్రమేణా " గురుపూర్ణిమ " గా మారిందని  అంటారు.  ఈ వ్యాస పూర్ణిమను వాడుకలోకి తెచ్చింది ఆదిశంకరులని కొందరంటారు.   

వసిష్ఠమహామునికి మునిమనుమడూ, శక్తి మహామునికి మనుమడూ, పరాశరమునికి పుత్రుడూ, శుకమహర్షికి జనకుడూ, నిర్మలుడూ ఐనట్టి,   శ్రీ వ్యాస మహర్షి  ఆదిగురువు. వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. ఈ వ్యాసుడు  పుట్టినరోజునే గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ  అంటారు. ప్రతి ఏడూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ ఉత్సవంగా జరుపుకుంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించి   గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలూ బహుమతులూ సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకొంటారు.  శ్రీమన్నారాయణుని స్వరూపమే వేదవ్యాసుడు.  అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదాలను విభజించి లోకానికి అందించిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలూ, భారత భాగవతాలూ లభించాయి. వ్యాసుడు  శ్రీమహావిష్ణుతేజంతో జన్మించినవాడు. కాబట్టే,    శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలుచుకుంటాం.

"వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్

వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మ నిధయే వాశిష్ఠాయ నమోనమః"

 

శ్రీమన్నారాయణుని నాభియందు జన్మించినవాడు బ్రహ్మ. అతని మానస పుత్రుడు వశిష్ఠుడు. అతని సంతానమే శక్తి మహర్షి. శక్తి పుత్రుడే పరాశరుడు.   అంటే, వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనం.  

 

ప్రతి వ్యక్తికీ గురువు అవసరం ఉంది.  శిష్యులు లేని గురువులుండొచ్చు. కాని గురువు లేని శిష్యులుండరు.  పరిపూర్ణావతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ  సాందీపని మహర్షి వద్ద శిష్యుడై  శుశ్రూష చేశాడు.  నిజమైన శిష్యుడెలా ఉండాలో లోకానికి చాటాడు. అదే కృష్ణుడు తిరిగి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుమ్" అంటాం.

 

గురువుకు కుల,మత,జాతి బేధాలుండవు. వయోబేధాలుండవు.  సాక్షాత్తూ పరమశివునికి తన పుత్రుడైన  సుబ్రహ్మణ్యుడే గురువు. లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసింది గణపతిముని. ఐతే, రమణులకు అత్యంత ప్రియశిష్యుడాయన. మనకు హితం చెప్పేవారంతా మన గురువులే.

 

గురుతత్వాన్ని వివరిస్తూ సిద్ధుడు  యదు మహారాజుకు ఒక అవధూత తన గురువుల గురించి చెప్పిన రీతిని ఇక్కడ మనం తలుచుకోవాలి.  యయాతి కొడుకైన యదు మహారాజు ఒకసారి వేటకు వెళ్లాడు. అడవిలో అతనికి ఒక సర్వసంగపరిత్యాగియైన ఒక అవధూత కనిపించాడు.  ఆయన సత్ చిత్ ఆనందునిగా చూసిన యదువు, స్వామీ మీరింత ఆనందంగా ఈ కీకారణ్యంలో ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే,  దానికి ఆ అవధూత,  నేను 24మంది గురువులనుండి జ్ఞానాన్ని పొంది, అనుష్ఠించి, ఆత్మజ్ఞానం పొందాను.  అందువల్లే నాకు నిర్హేతుకంగా, శాశ్వతంగా ఉండే ఆనందం లభించింది అని చెబుతూ,  వారి వారి సద్లక్షణాలను గ్రహించి,  వారిని గురువులుగా గ్రహించాననీ చెబుతూ, ఆ  24 గురువులెవరో ఇలా చెప్పాడు -  "మొదటి గురువు భూమి, రెండో గురువు వాయువు, మూడో గురువు ఆకాశం, నాలుగో గురువు అగ్ని, ఐదో గురువు సూర్యుడు, ఆరో గురువు పావురం, ఏడో గురువు కొండ చిలువ, ఎనిమిదో గురువు సముద్రం, తొమ్మిదో గురువు మిడత, పదో గురువు ఏనుగు, పదకొండో గురువు చీమ, పన్నెండో గురువు చేప, పదమూడో గురువు పింగళ అనే వేశ్య, పద్నాలుగో గురువు వేటగాడు, పదిహేనో గురువు బాలుడు, పదహారో గురువు చంద్రుడు, పదిహేడో గురువు  తేనెటీగ, పద్నెనిమిదో గురువు లేడి, పంతొమ్మిదో గురువు గ్రద్ద, ఇరవయ్యవ గురువు కన్య, ఇరవై ఒకటో గురువు పాము, ఇరవై రెండో గురువు సాలెపురుగు, ఇరవై మూడో గురువు భ్రమర కీటకం, ఇరవైనాలుగో గురువు  నీరు".   ఈ 24 గురువుల లక్షణాలూ ఉండేవాడు సద్గురువు.

 

గురుపౌర్ణమినాడు వ్యాసుడు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది.  అలాగే, తమకు చక్కని గురువు దొరకాలనుకునే వారు ఈ గురుపూర్ణిమనాడు శ్రీగురుదత్త చరిత్ర పారాయణ చేస్తే ఆ గురుదత్తుడు సంప్రీతుడై, మార్గాన్ని నిర్దేశిస్తాడు.  గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు.  తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ ఒక్క రోజే పూజిస్తే చాలదు. ఈ రోజున ఆరంభించి గురుపాదాలను శరణువేడి, నిత్యమూ ఆయనను సేవిస్తేనే మన జన్మ ధన్యమైనట్లు. 

"ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం

మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా"

 

మన ధ్యానానికి మూలం గురువు, మనం చేసే పూజకు మూలం గురుపాదాలు, మనకు మంత్రం అంటూ ఏదైనా లభించిందీ అంటే అది మన గురుదేవుల వాక్యాలే, మనకు మోక్షం కలగాలంటే దానికి మన గురువు కృప ఉండాలి.  అందువల్ల, గురువే మన సర్వస్వం అని  సేవిస్తేనే మనకు మోక్ష మార్గం సుగమమవుతుంది.

 

వేదవ్యాసుడు   - 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు' అని రెండు చేతూలూ ఎత్తి నమస్కరిస్తూ చెప్పాడు. నిజమైన గురువు బోధించేది అదే. దత్తావతార తత్వం కూడా అదే.  దత్తుడు శిరిడీసాయిగా, పర్తి సాయిగా ఈ భువిలో అవతరించి  సకల జనులూ ఐకమత్యంగా, సుఖ సంతోషాలతోఉండాలనే చెప్పారు.  శిరిడీసాయి తన శిష్యులకు  పూజ చేసుకొమ్మని  చెప్పింది ఒక్క గురుపూజ మాత్రమే.  గురువే మూల స్థంభం. అదుగో, ఆ స్థంభానికి పూజ చేయండి!” అన్నాడాయన. ఆయన ఆ మాట అన్నది ఆషాడ పూర్ణిమ నాడే.   పర్తిసాయిగా ఆయనే ప్రేమే మార్గం, సేవే సత్యం!” అని బోధించాడు. సదా ఇతరులకు సాయంచేయి. పక్కవారిని కష్టపెట్టకు!” అని జాగ్రత్తలు చెప్పాడు.  నిజంగా  పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ   విషయాన్ని మనమంతా త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.  

 

----

Saturday, November 2, 2013


దివ్వెల దీపావళి 
ముందు మాట -  ఈ కవర్ స్టోరీ  ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం (నవంబరు 3,2013)  కోసం వ్రాశాను. ఐతే, చివరి క్షణంలో ఆ అనుబంధం కవర్ స్టోరీ కాస్త్ నవంబరు2, 2013 నాటి భూమికలో షార్టు స్టోరీగా వచ్చింది.
అసలు స్టోరీ ఇదీ ...... చదవండిక....  వివివిరమణ
 


మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. 

 

ఆనంద ఉత్సాహాలతో  చిన్నా, పెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. 

 

"చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి... "  అనే ప్రసిద్ధమైన తెలుగు సినిమా పాట మీకు గుర్తుండే టుంది.

 

నిజమే. మన జీవితం చీకటి వెలుగల రంగేళే. అలాటి మన జీవితంలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. అందరినీ  జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.  అందరం కలిసి మెలిసి ఉండాలి. సంతోషంగా ఉండాలి.  చెడు ఎక్కవ కాలం నిలవదు. మంచి ఎన్నడూ నశించదు.

 

చీకటిని తిడుతూ కూచోకు. ఒక దీపం వెలిగించు, చీకట్లను పారద్రోలు అంటూ జగతిని జాగృతం చేసే చైతన్య  శోభావళి ఈ దివ్య దీపావళి.

 

అంటే, ఇక్కడ చీకటి అనేది అజ్ఞానం. దాన్ని జ్ఞానదీపంతో తొలగించుకో  అని అర్థం చేసుకోవాలి.

ఈ దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. దీపాలను వెలిగించినపుడు  మనకు నీలం, పసుపు, తెలుపు - ఈ మూడు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు మానవునిలో ఉండే  సత్త్వరజస్తమోగుణాలకు ప్రతీక.  వీటిని జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం  అని,   దీపాలను వెలిగించడం ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా  భారతీయులంతా నమ్ముతారు.

మానవుడు శక్తి ఆరాధకుడు కాబట్టే, ప్రతి పండగలోనూ శక్తి పూజ అంతర్లీనమై ఉంది. దసరా తొమ్మిది రోజులూ  దుర్గాదేవిగా  ఆరాధించి, దీపావళినాటికి లక్ష్మీదేవిని  పూజిస్తారు.  దుష్ట రాక్షసాది శక్తులను సంహరించాలంటే ఆది పరాశక్తియే సమర్థురాలు. అందుకే, మహిషాసురుని చంపడానికి దుర్గగా, నరకాసురుని చంపడానికి సత్యభామగా అవతరించాల్సి వచ్చింది.  కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలనీ  వాటిపై విజయం సాధించడం ఎంతో కష్టమనీ చెబుతూ, సరైన జ్ఞానం పెంపొందించుకుంటే విజయం మనదే అని చెప్పడమే దీపావళి పండగలోని అంతరార్థం. 

దీపం – పరబ్రహ్మ స్వరూపమే

దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదు అన్నది సత్యమే. కానీ, చెంత దీపం లేనిదే చీకటి సమసి పోదు. జ్ఞానం కలగనిదే  సమస్య తొలగదు. అందువల్ల  అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోవడమే దీపావళినాడు దీపం వెలిగంచడం. ఆ దీపం ఎలా ఉండాలంటే,   మట్టితో రూపొందిన  మన దేహం లాంటి  ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.

దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.  అందుకే   ప్రతి రోజూ మనం దీపాన్ని వెలిగించే వేళ విధిగా కింది శ్లోకం పఠించాలని పెద్దలు చెబుతారు.

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ||          

 

దీపావళినాడు నూనెలో (ముఖ్యంగా నువ్వులనూనెలో) లక్ష్మీదేవీ, నదులూ, బావులూ, చెరువులూ - వంటి వాటిల్లో   గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారట.  ఈ శ్లోకం చూడండి.

 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్ !

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ! !

 

అందుకే  దీపావళి నాడు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందే   అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుందనీ, గంగానదీ స్నాన ఫలం లభిస్తుందనీ, నరక భయం ఉండదనీ  పురాణాలు చెపుతున్నాయి.  సాధారణంగా  త్రయోదశి నాటి సాయంకాలం నాడు యింటి వెలువల యముడి కోసం  దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుందంటారు.  దానికే యమదీపం అని పేరు. పూర్వ కాలంలో ఇంటిల్లిపాదీ తలొక్క ప్రమిదలో దీపం వెలిగించి, కింది శ్లోకాలు చదువుతూ

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!

ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే ! !

 

వైవస్వతాయ కాలాయ సర్వ భూత క్షయాయ చ!

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః ! !

ఆ దీపాలను ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చేవారు. మారుతున్న  ఈ కాలంలో ఎవరూ ఇళా  చేస్తున్నట్టు లేదు.

అన్నట్టు, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపాన్ని దానం చేస్తే, మానవుడు యమ మార్గాధికారంనుండి విముక్తుడవుతాడని ఆస్తిక లోక విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు   చెప్తారు.

 

దీపావళి కథలూ, నమ్మకాలూ

వేద ధర్మమే మన ధర్మం. దాన్ని బట్టే పండగలూ వచ్చాయి. వాటి వెనక కథలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆరీతిలో దీపావళి పండగకు సంబంధించి ఎన్నోకథలు వాడుకలో ఉన్నాయి.  వాటిల్లో ప్రధానమైనవి:  నరకాసుర వధ,  బలిచక్రవర్తిరాజ్య దానం, శ్రీరాముడు రావణసంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమవటం (భరత్ మిలాప్), విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకం జరిగిన రోజు. 

 

శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు.

 

అన్ని కథల్లో నీతి ఒకటే. చీకటిని పారద్రోలి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి.  విజయానికి ప్రతీక  దీపావళి పండుగ.  అంతే.

 

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత . 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ   మూడుసార్లు జలతర్పణం విడుస్తారు. దానివల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం.  

 

అది పక్కనబెడితే, మనం ఒక విషయం గమనించాలి.  శరదృతువులో దీపావళి పండగ రావడంలో ఒక విశిష్టత కూడా ఉంది.  మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది.  వానలు తగ్గి చలికాలం ఆరంభమయ్యే ఈ సమయంలో  పురుగూ, పుట్రా కాస్త ఎక్కువగానే ఉంటి. వాటినించి రాత్రుళ్లు మనల్ని మనం కాపాడుకోడానికి  పండగ రూపంలో దీపాలను వెలిగిస్తే,   సాధ్యమైనంత వరకూ అవి మనదరిచేర నీయకుండా ఉంటాయి. అదీ  దీపావళి వెనక అసలు పరమార్థం.

 

ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి వస్తుంది. పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి నాడు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా మూడు రోజుల పండగగా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలి పాడ్యమి.  దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు ధనత్రయోదశి అని ఆచరిస్తారు. ఈ ధన త్రయోదశి అనేది అక్షయతృతీయకన్నా బలమైన రోజు. అమావాస్యకు తర్వాతి రోజును కొన్నిచోట్ల బలిపాడ్యమి(కార్తీక శుద్ధ పాడ్యమి)గా జరుపుకుంటారు. 

 

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపుకుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోజ్యాలతో  ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇల్లూ రంగవల్లులతో, పిండివంటల ఘుమఘుమలతో,   బంధువులూ, స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. పండగనాడు లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది.

 

ఎలాగూ పండగ కాబట్టి, ఆ ముందు రోజు ఇంట్లో పేరుకు పోయిన చెత్తనీ, పనికిరాని వస్తువులనూ బయటపారేసి, ఇల్లంతా సున్నాలు కొట్టించుకోవడం కూడా ఈ దీపావళికి సర్వసాధారణంగా అందరూ చేసే పని. లేదంటే, సంక్రాంతికి తప్పనిసరి. ఇదంతా ఎందుకు చేయడమూ అంటే, ఇంట్లోని అజ్ఞాననే చెడు శక్తిని పారద్రోలి,  సుజ్ఞానాన్ని పొందడమే తప్ప మరొకటి కాదు.

 

పండగ స్నానంలో వైద్య రహస్యం

నరక చతుర్దశినాడు వేకుజాముననే ఇంట్లోని పెద్దలూ, పిల్లలూ కూడా  ఒంటినిండా నువ్వుల నూనెను పట్టించి, కనీసం అరగంట సేపు నునెలో నానాక శీకాయపొడి లేదా నానబెట్టిన కుంకుడుకాయల రసంతో తలార స్నానం చేయాలి.  నువ్వుల నూనె దేహంలోకి ఎంత ఇంకితే అంత మంచిదంటారు. ఎందుకంటే, ఇక వచ్చేది చలి కాలం. చర్మం  పొడిబారుతుంది. కాబట్టి చర్మానికి నూనెతనం చాలా అసరం. అది ఈ అభ్యంగన స్నానం వల్ల సులభతరం అవుతుంది.  కీళ్లకు కూడా మంచిది. సోపులు వాడకుండా సున్నిపిండి శరీరాన్ని శుభ్రం చేసుకుంటే మరీ మంచిది కూడా. షాంపూల కన్నా కుంకుడుకాయ రసం శీకాయ రసం వంటివి వాడటం వల్ల తలలో పేలున్నా, చుండ్రు ఉన్నా తొలగిపోతాయి కూడా. ఈ విషయాన్ని హైటెక్కు ఆధునికులు గుర్తించితే మంచిది.

 

తెలుగు సాహిత్యంలో దీపావళి

తెలుగు సాహిత్యంలో దీపావళికి పెద్ద పీటే వేశారు కవులూ, రచయిత(త్రు)లూ, పండితులూ.  వైజయంతీ విలాసం, వర్ణన రత్నాకరం వంటివాటిల్లో దీపావళి ప్రస్తావన ఉంది. ఆధునిక కవులెందరో ఈ దీపావళిని మనోహరంగా వర్ణించారు.   దాశరథి తన ప్రాణ దీపం అనే కవిత కూడా మనకు గుర్తొస్తుందీ సందర్భంగా.  దీప లక్ష్మి, దీప శోభ, దీపావళి – ఇలా కవితల కు పేర్లు కూడా ఎన్నో మనకు తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.  సినిమాల్లో సరేసరి. వేరే చెప్పనక్కర్లేదు.  ఇవిగాక జానపదాల్లో కూడా దీపావళి ప్రస్తావనలతో కూడిన లక్ష్మీదేవి పాటలు ఎన్నో ఉన్నాయి.

 

పండగ పూట పూజలు

ధనత్రయోదశి, లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతం – ఇవీ దీపావళి పండగ సందర్భంగా అందరూ ఆచరించే పూజలు.  వీటన్నిటి వెనకా శక్తిపూజ ప్రాముఖ్యం ఎంతో ఉంది.  దీపావళి నాటి అర్థరాత్రి కాలంలో ఇంటినడుమ ధాన్యపురాశి పోసి, దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి, దానిపై లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుతారు.  ఆనక శ్రీ సూక్తం లేదా అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజచేసి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పాయసాన్ని నివేదిస్తారు.  నిజానికి దీపావళినాడు ప్రతి ఒక్కరూ చేయల్సిందదే.

 

పండగ నాటి తీపి వంటకాలు

 

ఈ దీపావళికి   రకరకాల తీపి వంటకాలు  చేస్తారు.  వాటి సంగతి చూద్దామా.

1. దీపావళి స్పెషల్ జిలేబి:  భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి దీపావళి ప్రత్యేక స్వీట్.

 2. సాంప్రదాయక పాయసం: పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. రకరకాల పాయసాలను  వండుతుంటారు. వీటిలో సేమ్యా   పాయసం చాలా ముఖ్యం.

3. గులాబ్ జామూన్: జామూన్ పేరు చెపితే చాలు.  నోరు ఊరిపోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా  జామూన్స్ ఎంతో బావుంటాయి.  

4. గుజియా: కొబ్బరితో చేసే గుజియా  అన్ని శుభకార్యాలకు, పండగలకు   తయారు చేసుకుంటారు

5. అరిసెలు: దీపావళి అనగానే  అరిసెలు గుర్తుకౌస్తాయి. బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు.  

 ఇక దీపావళినాడు చుర్మా లడ్డూ,సోన్ పాప్డి వంటివి ఉత్తరాది ప్రాంతాల్లో తప్పనిసరిగా చేస్తారు.  పాల పూరీ వంటివి దీపావళినాటి ప్రత్యేక ఆకర్షణలంటే అతిశయోక్తి కాదు.

 

బాణసంచాతో కాలుష్యం...

దీపావళి వేడుకల్లో అన్నింటికంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాణసంచా కాల్చడం. ఐతే, దానివల్ల జరిగే వాతావరణ కాలుష్యం గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత తక్కువగా టపాకాయలు కాల్చితే అంత ఎక్కువ పర్యావరణానికి మేలు చేకూరుతుంది. అంతే కాదు. మీ జేబులు కూడా అంత ఎక్కువ పదిలంగా ఉంటాయి.  బాణసంచా కాల్చడం కంటే మన జీవితాలు ముఖ్యమన్న విషయం తెలుసుకోవాలి.   కానీ   దీపావళి పండుగను పాత రోజుల్లో మట్టి దీపాలను వెలిగించి, లక్ష్మీదేవి పూజలు చేసి వేడుకలు జరుపుకునేవారు. అప్పట్లో బాణసంచాను కాల్చడం వంటివేమీ ఉండేవి కావు. అందువల్ల  వాతావరణ కాలుష్య  సమస్యే ఉండేది కాదు.  పైగా గోగు కాడలవంటి పర్యావరణ హితమైన వాటితోనే ఆనాటి బాణాసంచా తయారయ్యేది. కానీ, నేడు ఆధునికత పేరుతో పండగ పరమార్థం వ్యాపారంగా, ఫ్యాషన్ గా మారి  వెర్రి తలలు వేస్తోంది.

శబ్ద కాలుష్యంతో సమస్యలు...

అతి పెద్దగా శబ్దం చేసే బాణసంచా మూలంగా తీవ్రమైన శబ్ద కాలుష్యం కలుగుతోంది. నిజానికి ఒక టపాకాయ  పేల్చినప్పుడు దానినంచి వచ్చే శబ్దం నాలుగుమీటర్ల దూరంలో శబ్దం  125 డెసిబెల్స్‌కు మించి ఉండకూదని చట్టం కూడా ఉంది.  ఐతే, దీన్ని ఎవరూ పాటించడం లేదు. దానివల్ల  బాణసంచా కలిగించే  శబ్ద కాలుష్యం  ప్రజలపై  తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఎలాటి అనారోగ్య సమస్యలు రావచ్చు....

నేటి కాలంలోని బాణాసంచాలన్నీ ఎక్కువగా  రసాయన పదార్థాలతో తయారవుతున్నాయి. వాటి మూలంగా మన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.   అంతే కాదు. మితిమీరిన శబ్ధాలు కూడా మప్పును కలిగిస్తాయి.

·        రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది.

·        పెద్ద శబ్దాల వల్ల వినికిడి సమస్య రావచ్చు. శాశ్వతంగా చెవుడు రావచ్చు.

·        రాగితో తయారైన బాణాసంచాలవల్ల   శ్యాసకోశ సమస్యలు ఏర్పడవచ్చు.

·        మెగ్నీషియం తయారైన బాణాసంచాలవల్ల   వాటిల్లోని   మెగ్నీషియం పొగ రూపంలో వాతావరణంలో కలిసిపోయి చర్మ సంబంధ సమస్యలను సృష్టిస్తుంది

·        నైట్రేట్‌ తో తయారైన బాణాసంచా వల్ల మానసిక సమస్యలకు దారితీయవచ్చు

·        క్యాడ్మియంతో తయారైన బాణాసంచాలవల్ల   అనీమియా  రావచ్చు. లేదూ కిడ్నీ దెబ్బ తిననూవచ్చు.

·        సీసంతో తయారైన బాణాసంచా  నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

·        జింక్‌  ఉండే బాణాసంచా వల్ల వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువ

నేటి మాట - ఎకో ఫ్రెండ్‌లీ టపాకాయలు...

ఎకో ఫ్రెండ్‌లీ  టపాకాయల్లో ఆకులను వాడటంవల్ల  తక్కువ శబ్దాలతో ఇవి పేలుతాయి. కేవలం ధర తక్కువ మాత్రమే కాదు.  తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా ఆట్టే పెద్దగా శబ్దాలు చేయని ఈ టపాకాయలవల్ల పిల్లలకు ప్రమాదం తక్కువ. దీంతో అందరూ ఎకో ఫ్రెండ్లీ టపాకాయలనే వాడాలని పర్యావరణ ప్రేమికులు ప్రచారాన్ని చేపడుతున్నారు.

చివరిగా ఒక్క మాట -

బాణాసంచా వంటి వాటి సంగతిని పక్కనబెట్టి, ముందు సహజంగా దొరికే నువ్వులనూనె, కుంకుడు కాయ, శీకాయ, సున్నిపిండి – వీటిని వాడటం వల్ల కలిగే లాభాలను గుర్తుతెచ్చుకోండి. షాంపూలనూ, సబ్బులనూ మీ టీవీలకే పరిమితం చేసేయండి. పాక్డ్ తిండికీ, స్వీట్లకీ స్వస్తి చెప్పండి. సాధ్యమైనంత వరకూ మీ వంటకాలను మీరే శుచిగా వండుకోండి. ఆ అజ్ఞానం తొలగితే, మీ దీపావళి పండగ పట్ల సార్థకమైనట్లే.  ఆరోగ్య లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, ధన లక్ష్మిగా లక్ష్మీదేవి సదా మీతోనే ఉంటుంది.  సందేహం లేదు.

*****

 

Monday, November 12, 2012

దీపావళి నవ్యకేళి


వెలుగుల కేళి

  • 11/11/2012
  • వి.వి.వి.రమణ

మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సాహాలతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. జగతిని జాగృతం చేసే చైతన్య శోభావళి ఈ దివ్య దీపావళి. మన చుట్టూ ఆవరించుకున్న చీకటినే తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అన్నది ఆర్యోక్తి.

జన జీవితంలో భాగం దీపావళిపంచ భూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగానూ ప్రసాదిస్తుంది. అందుకే భారతీయులు అనాదిగా అగ్ని సాక్షిగానే ప్రతి పనీ చేస్తున్నారు. దీపాలను వెలిగించడం ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలం, పసుపు, తెలుపు-ఈ మూడు రంగులు మానవునిలో ఉండే సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకగా చెబుతుంటారు.ఈ మూడు రంగులను జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం అని. దీపాలను వెలిగించడం ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా భారతీయులంతా నమ్ముతారు. స్వామి దయానంద సరస్వతి హిందూ ఆధ్యాత్మికత యొక్క గొప్పదనాన్ని చాటడానికే అన్నట్టు, అమావాస్య రోజునే సన్యాసాన్ని స్వీకరించారు.భారతీయతలో భాగంగా దీపావళి పండగ ఒక పర్వదినంగా, జీవితంతోపాటు జీవితంలో భాగంగా వస్తోంది. అందుకే ఒక సినిమా కవి దీపావళిని చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళిఅని బహుచక్కగా వివరించాడు. దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకోలేదు అన్నది సత్యమే. కానీ, చెంత దీపం లేకుండా చీకటి పోదు కదా. దీపం పేరు చెబితే చీకటి పోతుందా అనే సామెత ఎలాగూ ఉంది. చీకట్లో చేసిన పనులను దుష్కార్యాలుగా జమకడ్తారు. ఈ భావానే్న, చీకటి మనసులతో చేసిన పాపాలను గురించి ఆర్పేసిన దీపం వాంగ్మూలం ఇస్తుందని చెప్తారు. చీకటి బజారు అన్న పదం కూడా చాలా ప్రతికూలంగా చెప్పుకోవడం కూడా పరిపాటే.అజ్ఞానాన్ని పారద్రోలేదే జ్ఞాన దీపం’ ‘ఊరికి దీపం బడి-మనిషికి దీపం నడవడిఅని నానుడి. అసలు దీపాలను ఎందుకు వెలిగిస్తామూ అంటే మనలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోడానికన్నమాట. ఆ దీపం ఎలా ఉండాలంటే, మట్టితో రూపొందిన మన దేహం లాంటి ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తితో జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే॥ అని కొందరంటే దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హారతే పాపం సంధ్యా దీప నమోస్తుతే॥ అని మరికొందరంటారు.దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుకే ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ మనం దీపాన్ని వెలిగించే వేళ విధిగా పఠించాలని పెద్దలు చెబుతారు.కామ, క్రోధ, లోభాలు నరకానికి కారణాలు అని గీతాచార్యుడు వివరించాడు. వీటిని జయించాలంటే, అజ్ఞానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ఞానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరికీ కావలసింది అదే. భక్తి వైరాగ్యాలతో అజ్ఞానాంధకారాన్ని ఎదుర్కొని జ్ఞాన జ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనే ఉంది. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యా సమయంలో దీపాన్ని దర్శించడం, దీపానికి నమస్కరించడం మనకు సదాచారం. సత్సంప్రదాయం.

దీపం దైవ స్వరూపంసాధారణంగా త్రయోదశినాటి సాయంకాలం నాడు ఇంటి వెలుపల యముడి కోసం దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుందంటారు. దానికే యమదీపం అని పేరు. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపాన్ని దానం చేస్తే, మానవుడు యమ మార్గ్ధాకారంనుండి, విముక్తుడవుతాడని ఆస్తిక లోక విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్టు చెప్తారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని కౌముదీ మహోత్సవంఅని నిర్వచించాడు. నరక చతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడంటారు. దీపావళి నాడు కౌముది మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రా రాక్షసం గ్రంథం వల్ల తెలుస్తోంది. బౌద్ధ జాతక కథల్లో లక్షదీపోత్సవం, దీపదానం కూడా జరిపినట్లు అనేక కథలున్నాయి. బుద్ధుని చుట్టూరా దీపాలను పెట్టి పూజించినట్లు కథలున్నాయి.దీపావళి గురించిన కథలు...దీపావళినాటికి కూతురిని, అల్లుడిని పిలిపించే సంప్రదాయం నాగానందంలో వర్ణించినట్టు తెలుస్తోంది. విశ్వవసు అనే రాజు తన కూతురైన మలయవతికీ, అల్లుడికీ కార్తీక శుక్ల పాడ్యమి నాడు బహుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడట. మహావీరుడు ఈ అమావాస్య నాడే మరణం చెందినట్లు, ఆనాడు దేవతలు ఆయన్ని పూజించి, ‘పావానగరమంతా దీపాల్ని వెలిగించారని అప్పటినుండి దీపావళి పండగ ఏర్పాటైందని జైన హరివంశంలో వివరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. సకల కళా సంస్కృతులతో విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యపు కాలంలో దీపావళిని వైభవోపేతంగా జరుపుకునే పద్ధతి ఉందని తెలుస్తోంది.ఐతే, నేడు దీపావళి చుట్టూ అనేకానేక కథలు వాడుకలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్యదానం, రావణ సంహారానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమవడం (భరత్ మిలాప్), విక్రమార్క చక్రవర్తి పట్ట్భాషేకం జరిగిన రోజు.శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుడ్ని వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ.

ఇంకో కథ కూడా ఉంది. లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు.బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిన రోజు దీపావళి!రావణుని చంపి రాముడు తన అర్ధాంగి సీతతో విజయోత్సాహంతో వచ్చిన రోజు దీపావళి!నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంట వెళ్లి వధించి విజయోత్సాహంతో వేడుక జరిపిన రోజు దీపావళి!అంటే, చీకటిని పారద్రోలి వెలుగులు ఇచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. నరకాసురుడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది నరకాసుర వధ. నరకశబ్దానికి నరకం అనడానికి బదులు నరకాసురుడుఅని అన్వయించి కాల క్రమంలో పురాణకథ జోడించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన రహస్యం ఉందని ఇంకొందరి అభిప్రాయం.ఉత్తరాది భారతీయులు, ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. పశ్చిమ బెంగాల్‌లో దీపావళి రోజున శివ సహితంగా కాళీ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పండగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవడానికి కాకరపువ్వొత్తులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, మతాబులు మొదలైన బాణాసంచాను కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు. దీపావళి పండుగల్లాంటి వేడుకలు ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.ప్రతియేటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ఈ దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా ఈ దీపావళి పండగను మూడు రోజుల పండగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటిరోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలి పాడ్యమి. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి, అంతకు ముందు కొందరు ధన త్రయోదశి అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి రోజును కొన్ని చోట్ల బలిపాడ్యమి (కార్తీక శుద్ధ పాడ్యమి)గా జరుపుకుంటారు.నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపాన్ని దానం చేయాలి. సాయంకాలం దేవాలయానికి వెళ్లి దీపాలను వెలిగించాలి. అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేయడం మంచిది. ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్లలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగ చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్లలో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొనె్నలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో తెప్పలాగా వదులుతారు. ఆ రోజు రాత్రికి స్ర్తిలు చేటలు, తప్పిటలు వాయిస్తూ సంబరంగా జ్యేష్ఠాదేవిని (అలక్ష్మి, పెద్దమ్మవారు, దరిద్రదేవత) ఇండ్లనుండి తరిమివేస్తారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజిస్తారు. ఇది మూడవ రోజు. బలి పాడ్యమి. బలి పాడ్యమి ఉదయం ఆటలాడతారు. ఆ రోజు గెలిస్తే సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఈ బలి పాడ్యమి రోజునే గోవర్ధన పూజ చేస్తారు.అశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమికి సముద్ర, నదీ స్నానాలను ఆచరించి ఆ నీటిలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహ సముదాయాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే వాతావరణంలో నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచా చప్పుళ్లు చిన్నా, పెద్దా అంతా ఆనందంగా గడిపే దీపావళి గురించి ఎంతని వ ర్ణించగలం? దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయి. దిబ్బు దిబ్బు దీపావళిఅంటూ సాయంత్రం కాగానే ప్రమిదలతో వత్తులు వేసి, నూనె పోసి ఇంటి ముందు వరండాలో దీపాలు వెలిగిస్తారు.శరదృతువులో దీపావళి పండగ రావడంలో ఒక విశిష్టత కూడా ఉంది. మనోనిశ్చలతకు, సుఖ శాంతులకు అనువైన కాలం ఇది. వానలు తగ్గి చలికాలం ఆరంభమయ్యే ఈ సమయంలో పురుగు, పుట్రా కాస్త ఎక్కువగానే ఉండడాన్ని మనం గమనించవచ్చు. రాత్రిళ్లు వాటినుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పండగ రూపంలో దీపాలను వెలిగించి వాటిని సాధ్యమైనంత వరకూ దరిచేర నీయకుండా చేయడం దీని వెనుక అసలు పరమార్థం.నరక చతుర్దశి అశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకాసురుడు వధించబడ్డాడు. అందుకే ఆ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించాడీ నరకుడు. నరకాసురుడు రాక్షసుడు. చెలరేగిపోయి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగించనారంభించాడు. లోక కంటకుడైన నరకాసురుడు మహావిష్ణువు చేతిలో కాక తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందింది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినపుడు భూదేవి సత్యభామగా జన్మించింది. ఆ లోక కంటకుడి అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్లాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణించాడు. నరకుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా అందరూ పిలిచేలా వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధు జనులను, పదహారు వేలమంది రాజకన్యలను విడిపించి శ్రీకృష్ణుడు ధర్మాన్ని మళ్లీ ప్రతిష్టింపచేశాడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాల క్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.దీప లక్ష్మీదేవి దీపావళి అంటే దీపోత్సవమే. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలు ఇలా చెప్పాయి.తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్‌ అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే॥ దీపావళినాడు నూనెలో (నువ్వుల నూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటారుట. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయడంవల్ల దారిద్య్రం తొలగడమే కాక గంగానదీ స్నాన ఫలం లభించి నరక భయం ఉండదన్నది పురాణాలు చెప్పే మాట.దీపావళి అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధిగా వస్తున్న ఆచారం. దానివల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారన్నది అనాదిగా భారతీయుల్లో నమ్మకం. స్ర్తిలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకుంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్య భోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంట బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుంటాయి.మహాలక్ష్మీ పూజ దీపావళి సందర్భంగా మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి కూడా ఒక కథ చెబుతారు.ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుని వద్దకు వెళ్లాడట. దేవేంద్రుడి ఆతిధ్యానికి సంతసించి దుర్వాసుడు ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడట. ఐతే ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కివేసింది. దాంతో దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపించాడట. ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని, సర్వ సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచక కాపాడమని శ్రీహరిని ప్రార్థించాడట. అతని ప్రార్థనలకు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని చెప్పాడట. ఇంద్రుడు అలాగే చేయగా, లక్ష్మీదేవి అనుగ్రహించడంతో, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.ఆ సమయంలో దేవేంద్రుడు తల్లీ! నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?’ అని ప్రశ్నించాడట. దానికి లక్ష్మీదేవి సమాధానమిస్తూ, ‘నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా ప్రసన్నురాలనౌతాననిసమాధానమిచ్చిందట. అందువల్ల ఈ దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ఎవరు ఎలా తెలియగోరి ప్రార్థ్ధిస్తే, ఆ విధంగా ఆ తల్లి కరుణిస్తుంది.దిబ్బు దిబ్బు దీపావళి...దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని సంప్రదాయంగా నేటికీ మనం కొన్ని ప్రాంతాలలో చూస్తుంటాం. సాయంత్రాలు ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం, పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్లు కడుక్కుని ఇంటి లోపలకి వచ్చి తీపి పదార్థం తింటారు. తరువాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు.బాణాసంచా కాల్చడంవల్ల ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్య్ర దుఃఖాలు దూరంగా పారిపోతాయి. అందువల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందనీ, ఈ వర్ష రుతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా వల్ల నశిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.నరకాసుర వధ వృత్తాంతం విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రంలోకి ప్రవేశించి ఆ రాక్షసుడిని చంపి, భూమిని మళ్లీ పైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో వరాహావతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భం దాల్చింది. ఐతే ఆ శిశువు త్రేతాయుగంలో తాను శ్రీరామునిగా అవతరించి, రావణ సంహారం చేశాక జన్మిస్తుందని భూదేవికి తెలిపాడు. త్రేతాయుగంలో జనకునకు సీతను భూమినుండి దొరికినపుడు, తనకొక ఉపకారం చేయమని భూదేవి జనకుని కోరింది. ఆ మాట ప్రకారం జనకుడు రావణ వధ తర్వాత జన్మించిన భూదేవి కుమారుని పెంచి విద్యాబుద్ధులను నేర్పించాడు. అతడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాల వయసు వచ్చేప్పటికి అతనిని భూదేవి గంగాతీరానికి తీసుకువెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకుని కామరూప దేశాన్ని పాలించుకొమ్మని నరకుడికి చెప్పి అదృశ్యమయ్యాడు.నరకుడు కామరూప దేశాన్ని చాలా కాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకుడికి బాణుడనే రాక్షసునితో స్నేహం ఏర్పడింది. ఆ ప్రభావంతో నరకుడు లోక కంటకుడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ట మహర్షి ప్రాగ్జ్యోతిష పురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా దేవాలయం తలుపులు మూయించాడు. దాంతో కోపించిన వశిష్డుడు నీవు మద గర్వంతో మితిమీరి సజ్జనులను అవమానిస్తున్నావు. నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావుఅని శపించాడు. ఆ శాపానికి భయపడి నరకుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణం లేకుండా ఉండేలా వరాన్ని పొందాడు. ఆ వరాన్ని పొందానన్న గర్వంతో చెలరేగిపోయాడు. రుషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు. ఇంద్రాది దేవతలను జయించాడు.నరకుడి బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన నరకుడిని చంపడానికి కామరూప దేశానికి సత్యభామాదేవితో సహా వెళ్లాడు. అక్కడ నరకుడికీ, కృష్ణుడికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. అశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులై ప్రజలు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినం వేకువ జామున పండుగ జరుపుకున్నారు. ఆ రెండు రోజులే నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలు.బలి చక్రవర్తి రాజ్యదాన కథ బలిచక్రవర్తి అజేయ బల పరాక్రమాలుకలవాడు. మహా దాత. అడిగినవాడికి లేదనకుండా దానం చేసేవాడు. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలం ముగిసాకనే అతన్ని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి మహా విష్ణువు అదితి గర్భాన వామన రూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞాన్ని చేయసాగాడు. అప్పుడు వామనావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడిగాడు. బలి చక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతైఅన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగునకు స్థలం లేకపోయింది. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావని వామనుడు అడగ్గా, బలి చక్రవర్తి దానిని తన తలమీద పెట్టమని కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.ప్రపంచ దేశాల్లో దీపావళి ప్రపంచ వసుదైక కుటుంబంగా మారడం ఆనాడే గమనిస్తాం. కళ, సంస్కృతి రంగాల్లో ప్రముఖంగా ఈ విధానానే్న గమనిస్తాం. సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడు అల్‌బెరూనీ 11వ శతాబ్దంలో దీపావళిని మన దేశంలో ఎలా జరుపుకుంటామో వివరించాడు.ఎక్కువ దేశాల్లోని చారిత్రక ఆధారాలను చూస్తే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో దీపదానం చేసే ఆచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఈజిప్ట్, యమన్‌లలో జరుపుకునే సూర్యదేవత జన్మదినోత్సవం నడుస్తుంది. ఈజిప్టులో దక్షిణాయనం ప్రారంభ సూచకం, మరణించినవారిపై గౌరవ సూచకంగా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారం, మరణించిన వారి ఆత్మ తమ ఇళ్ళకు తిరిగి వస్తుందనే విశ్వాసంతో సమాధులనుండి ఇళ్ల వరకు దీపాలని వరసగా వెలిగించి బారులు కడతారు.చైనాలో ఏడాదికి రెండుసార్లు దీపోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో మన దీపావళి లాంటి హోలోవీన్ను నవంబర్ ఒకటవ తేదీనాడు జరుపుకుంటారు. ఈ పండుగను క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల క్రితమే ఇప్పటి ఆంగ్లేయుల పూర్వీకులు కెల్ట్ (డ్రయిడ్) జాతివారే ప్రారంభించారట. రోమనులు పామోనాపండగ కూడా అలాగే ఉంటుంది. ఫలితంగా క్రైస్తవులు ఆల్ హోలోన్’, ‘ఆల్ సెయింట్స్‌డేఅని పండగలు జరుపుకుంటారు. నేటికీ క్రైస్తవులు జరుపుకునే కాండిల్ ఫెస్టివల్మన దీపావళితో పోల్చదగ్గదే. ముస్లింల్లోనూ దీపావళిలా షబేబారాత్’ (రాత్రి ఊరేగింపు) అని చేస్తారు. మహమ్మద్ పైగంబర్, మక్కాకు తిరిగి వెళ్లిన రోజు రాత్రికి సూచకంగా ఇలా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారానికి శ్రీకారం చుట్టారంటారు. ఆ రోజున బాణాసంచా కాల్చి మతాబులు వెలిగిస్తారు.మన దేశంలో దీపావళి మన దేశంలో దీపావళి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కరలేదు. గోవా వంటి చోట్ల పెద్ద పెద్ద రావణుని రూపాలను ఊరేగించి చివరన ఒకచోట చేర్చి పిడకలు, కట్టెలూ అన్నీ పేర్చి వాటిని దహనం చేస్తారు. బీహార్‌లో రావణ, కుంభకర్ణుల రూపాలను సంహరించి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గుజరాత్‌లో దీపావళి ఆరు రోజుల పండగ. అదే మహారాష్టల్రో నాలుగు రోజుల పండగ. పశ్చిమ బెంగాల్‌లో దేవీ నవరాత్రులు అంతం కావడం దీపావళి వేడుకలు ఆరంభం కావడంవల్ల ఆ రాష్టమ్రంతా పండగ వాతావరణంలోనే ఉంటుంది. ఒరిస్సాలో నరక చతుర్దశికి అంత ప్రాముఖ్యం లేదు. దీపావళి నాడే పెద్ద పండగ. రాజస్థాన్‌లో పిల్లులకు పూజ చేసి విందు చేస్తారు. పిల్లి సంతృప్తి చెందితే అంతా మంచే జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. పంజాబ్‌లో దీపావళి మరుసటి రోజ భాయి దూజ్ పండగ చేసుకుంటారు. ఆ రోజు ప్రతి మహిళా తన సోదరులను కలిసి వారికి వీర తిలకం దిద్దడం అక్కడి ఆనవాయితీ.దీపావళి పండగ-జాగ్రత్త పడండి!వెలుగులు చిమ్మే దీపావళి పండగలో పిల్లలకైనా, పెద్దవారికైనా ఆనందాన్నిచ్చేవి టపాకాయలే! ఫైర్ వర్క్స్ లేని దీపావళి పండగను ఊహించగలరా? ఆ పని ఎవరూ చేయలేరు. దీపావళి నాడు టపాకాయలు ఎంత ప్రాముఖ్యమో పండగ ఆనందం కోల్పోరాదంటే అవి కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ప్రధానమైనవి. కొన్ని ముందు జాగ్రత్తలు ఆచరిస్తే దీపావళి సంబరాలు మనకు మరువలేని అనుభూతులను, ఆనందాన్ని ఇస్తాయి. పిల్లలు టపాకాయలు కాల్చడమనేది పూర్తిగా పెద్దల పర్యవేక్షణలో జరగాలి. దీపావళి రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మరింత ఆనందం కలుగుతుంది. ఈ పండగ జీవితకాల మాధుర్యంగా మిగిలిపోతుంది. మీ దీపావళి సరంజామాను కాల్చే విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. * టపాసులను కొనుక్కుని వచ్చాక, ఇంట్లో వేడి, నిప్పు, నీరు తగలని ప్రదేశంలో సురక్షితంగా ఉంచండి. వీటిని గట్టి మూత గల బాక్స్‌ల్లో పిల్లలకు, పెంపుడు జంతువులకు అందని చోట భద్రంగా ఉంచాలి. * టపాసుల ధ్వని 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ కనుక వాటి ధ్వని మీ లోపలి చెవికి హాని కలిగించవచ్చు. ప్రతి 15 నిముషాలకు కొంత విశ్రాంతినివ్వండి. చెవుల్లో కాటన్ దూదులు పెట్టుకుంటే మంచిది. పసి పిల్లలను ధ్వనులనుండి దూరంగా ఉంచండి.దీపావళి పండుగ వస్తుందంటే పండగకు ముందు వారం రోజులు తర్వాత వారం రోజులు టపాకాయల పేలుళ్లు, వాటి పొగలు, ధ్వని, వాతావరణ కాలుష్యం కలగజేస్తాయి. మీరు చూపే అత్యుత్సాహం వల్ల శబ్ద, వాయు కాలుష్యం అధికమై అది పర్యావరణం చేటుకు దారి తీస్తుందన్న విషయం మరిచిపోవద్దు.

................ఏం చేయాలి? ఏం చేయకూడదు? .....................చేయాల్సినవి: -

టపాకాయలు లైసెన్సు పొందిన అధీకృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయండి- టపాకాయలను గట్టి మూత వున్న బాక్సులో పెట్టండి.- టపాకాయలు వేడికి దూరంగా, పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి.- టపాకాయలను ఒకరే నిర్వహించకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాగ్రత్తలు తీసుకోండి- టపాకాయలను వెలిగించేటప్పుడు టపాకాయకూ, మీకూ మధ్య దూరం ఉండేలా చూసుకోండి.- టపాకాయలను వెలిగించేటప్పుడు కేవలం ఒక పొడవైన కేండిల్ లేదా కాకరపువ్వొత్తి వంటి దాన్ని ఉపయోగించండి. అగ్గిపుల్లలతో వెలిగించవద్దు. - టపాసులు కాల్చే సమయంలో అందుబాటులో ఎప్పుడూ ఒక బకెట్ నీళ్లు ఉంచుకోండి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు నివారించడానికి ఉపయోగించవచ్చు.చేయకూడనివి:- సరదాకైనా సరే, ఎప్పుడుగానీ టపాకాయలు చేతితో పట్టుకుని కాల్చకండి.- గుంపులున్న చోట, ఇరుకైన ప్రదేశాల్లో టపాకాయాలు కాల్చకండి.- టపాకాయలను ఇంటిలోపల కాల్చకండి. చుట్టుపక్కల గుడిసెలు గానీ, గడ్డివాములు గానీ లేకుండా ఉండే ఆరుబైట ప్రదేశాల్లో కాల్చండి.- పెద్దవారు పక్కన లేకుండా కేవలం పిల్లలే టపాకాయలు కాల్చుకోవడానికి పెద్దలు ఒప్పుకోవద్దు.- ధ్వని పెద్దగా రావాలని టపాకాయలను సీసాలలో గానీ, డబ్బాలలోగానీ పెట్టి కాల్చకండి.- టపాకాయ వెలిగించిన తర్వాత అది వెలుగుతోందా లేదా అని దానిమీదకు ముఖం పెట్టి చూడకండి. అలాగే ఒకవేళ అది సరిగా కాలకపోతే అది కాలిందా లేదా అని దగ్గరకు వెళ్లి పరీక్షించవద్దు. కొత్తది కాల్చండి.- భూచక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను మరిచిపోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.- మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులు, అగరవత్తులను ఉంచొద్దు.

..............బాణాసంచా రాజధాని-శివకాశి........................

శివకాశి బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. దేశంలోని టపాసుల ఉత్పత్తిలో శివకాశి వాటా 90 శాతం. తమిళనాట మధురైకి దక్షిణాన, చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివకాశికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. 14వ శతాబ్దంనుంచే ఈ నగరం ఉంది. హిందువుల పవిత్ర క్షేత్రం కాశీ ఉత్తరాదిన ఉండగా, దక్షిణాదిన రెండు కాశీలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటి తెన్‌కాశి కాగా మరోటి శివకాశి. ఇవి రెండూ తమిళనాడులోనే ఉన్నాయి. 14వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన వారణాసిలో శివుడిని దర్శించుకుని అక్కడినుంచి శివలింగాన్ని తీసుకువచ్చాడు. దీన్ని తాను ఉంటున్న తెన్ కాశిలో ప్రతిష్టించాలని భావించాడు. శివకాశికి వచ్చాక ప్రయాణ బడలిక తీర్చుకున్నారు. ఈ లింగాన్ని తీసుకొస్తున్న గోవు అక్కడినుంచి కదలనని మొండికేసింది. దీంతో ఆయన ఆ లింగాన్ని తన స్వస్థలం తెన్‌కాశికి తీసుకెళ్లలేమని భావించి దాన్ని అక్కడే ప్రతిష్టించాడు. అందుకే ఈ నగరానికి శివకాశి అని పేరొచ్చిందంటారు.343.76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 2.5 లక్షల జనాభా ఉండే శివకాశిలో దాదాపు 65 వేల కుటుంబాలు, 8 వేల పరిశ్రమలు (అనుమతి ఉన్నవి, లేనివీ కలిపి) ఉన్నాయి. ఏటా 1500 కోట్ల రూపాయల బాణాసంచా వ్యాపారం జరుపుతుంది శివకాశి. ఇక్కడినుంచి బాణాసంచా విదేశాలకూ ఎగుమతి అవుతాయి. కనకే శివకాశి ప్రపంచ బాణాసంచా రాజధానిగా పేరొందింది.అగ్గిపుల్లల పుట్టినిల్లు చైనా అని అందరికీ తెలుసు. 1921 ముందు భారత్‌కు ఫ్రాన్స్, ఇంగ్లండ్ నుంచి అగ్గిపుల్లలు దిగుమతి అయ్యేవి. 1921 తర్వాత పరిస్థితి మారింది. కోల్‌కతాలో మొదటిసారి అగ్గిపెట్టెల పరిశ్రమ ఏర్పాటైంది. ఆ తర్వాత శివకాశికి చెందిన పి.అయ్యానాడార్, ఎ.షణ్ముగనాడార్ అనే ఇద్దరు వ్యక్తులు జర్మనీ నుంచి యంత్రాలను తీసుకువచ్చి ఇక్కడ అగ్గిపుల్లల పరిశ్రమను ఏర్పాటు చేసారు. అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకోవడం, విదేశీ వస్తు బహిష్కరణ చేయడంవల్ల దేశంలో శివకాశి అగ్గిపుల్లలకు డిమాండ్ పెరిగింది. అప్పటినుంచి ఇక్కడ పెద్దఎత్తున అగ్గిపుల్లల తయారీ మొదలైంది. తర్వాత ఇక్కడ పరిశ్రమల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 280 అగ్గిపుల్లల చిన్నస్థాయి పరిశ్రమలు, 3200 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఏటా 15 కోట్ల అగ్గిపుల్లలు తయారుచేస్తున్నారు. దేశానికి అవసరమైన అగ్గిపుల్లల్లో 70 శాతం ఈ తరహా పరిశ్రమలనుంచే ఉత్పత్తి అవుతున్నాయి.భారతీయ మినీ జపాన్1960 సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలే సమయంలో అందరు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే శివకాశిలో వున్న నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ధి చెందాలని కలిసి నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. గణనీయమైన వృద్ధి సాధించారు. అది తెలుసుకున్న నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శివకాశికి కుట్ట జపాన్ (చిన్న జపాన్) అని పేరుపెట్టారు.

 ..............దీపావళి పండుగ కాలుష్యాన్ని అరికట్టే 5 మార్గాలు! ..............ప్రతి ఏడు ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉన్నప్పటికీ కాలుష్యంవల్ల మన మనుగడ కష్టతరమైపోతోంది. ఈ కాలుష్యం తగ్గాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి. వాటిలో ప్రధానమైనవి కొన్ని సూచనలు పాటించండి. * దీపావళి వేడుకలకు ప్రధానంగా ఇండ్లలో లైటింగ్ ఏర్పరుస్తాం. సంప్రదాయ నూనె దీపాలు మంచివి. విద్యుత్ దీపాలకు బదులు నేడు ఆధునికంగా వస్తున్న గ్రీన్‌లైట్లు పెట్టండి. * దీపావళిని దివ్వెల పండుగ అన్నారే కానీ ధ్వని కాలుష్యాన్ని కలగచేసే పండుగ అనలేదు. మీరు కాల్చే టపాసులు రంగురంగుల పూలతో కాంతులిచ్చేవిగానే ఎంపిక చేసుకోండి. కానీ చెవులు పగిలేలా లేదా గుండెనొప్పులు వచ్చేలా అధిక ధ్వనులు వచ్చే బాంబులు వంటివాటి జోలికి పోకండి. * టపాకాయలవల్ల అధిక కాలుష్యం కలుగుతుంది. వాటిని ఆపలేం. అయితే కాల్చేటప్పుడు కొంత బాధ్యత వహించి సాధారణంగా ఇండ్లముందు, రోడ్లమీద కాకుండా నివాసాలకు దూరంగా బయట ప్రదేశాల్లో కాలిస్తే ధ్వని, పొగ కాలుష్యాలుండవు. * దీపావళి వచ్చిందంటే అంతా ప్లాస్టిక్ కవర్లు, బాక్సులే దర్శనమిస్తాయి. టపాకాయల కవర్లు, స్వీట్ బాక్సుల కవర్లు, పగిలిన బాటిల్స్ ఇలా ఎన్నో దర్శనమిస్తాయి. పండుగ పేరుతో ఆనందించదగినదే. కాని అనవసరమైన ప్లాస్టిక్, బాటిల్స్ వంటి వాటికి చోటివ్వకండి. వీటన్నింటినీ సేకరించి తగిన విధంగా నిర్మూలించండి* దీపావళి మరుసటి రోజు మీ ఇంటిముందు, ఇంటి లోపల, రోడ్డుపైనా ఎక్కడ చూసినా చెత్తే. మీరు రూపొందించిన ఈ చెత్తను తొలగించే చర్యలు మీరే చేపట్టండి. మీ ఇంటి ముంగిట వున్న చెత్తనంతా దూరంగా పడవేసి దానిని తగలబెట్టడం వంటి చర్య చేస్తే మీ పరిసరాలు కాలుష్యం లేకుండా ఉంటాయి.ఈ చర్యలలో కొన్నింటిని పాటించినా చాలు. మీరు కాలుష్యాన్ని తొలగించడానికి లేదా తగ్గించడానికి పాటుపడిన వారవుతారు. అందువల్ల ఈసారి పండుగను కాలుష్యం లేని విభిన్నరీతిలో జరుపుకుని ఆనందించండి. *