Tuesday, October 26, 2021

అనుకున్న విధంగా బ్లాగ్ ను తాజా చేయాలనుకొన్నాను. కానీ  ఎడమకంటి కి ఇన్ ఫెక్షన్ సోకడంతో వారం, పది రోజులుగా ఏమీ చేయలేకపోయాను. అపుడెపుడో నేను సైన్సు ఎందుకు రాస్తున్నాను అని ఒక వ్యాసం రాశాను. దానిని ఈ మధ్యే ఒక దిన పత్రికలో ప్రచురించారు కూడా. పూర్తి వ్యాసం మీ కోసం...

నేను చదివిన రచనలే నన్ను సైన్సు రచనలు చేయడానికి పురిగొల్పాయి

-డా. వి.వి. వేంకటరమణ  9441234429

 

నేను పుట్టిందీ పెరిగిందీ తిరుపతిలో. మానాన్నగారు స్వర్గీయ శ్రీ వి.ఎస్‌. వేంకటనారాయణ. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.   అనేక కారణాలవల్ల నేను ఎంఎస్సీ చేసి సాఫ్ట్‌ వేర్‌ రంగంలో స్థిరపడాల్సి వచ్చింది. మా  రోజుల్లో మేం చదివిన మునిసిపల్‌ స్కూళ్లలో సైతం జీవ, భౌతిక, రసాయనశాస్త్ర పరిశోధనాలయాలంటూ ఉండేవి. పాఠం చెప్పేటపుడు పలురకాల నమూనాలను ప్రదర్శించేవారు.  పాఠశాల గ్రంథాలయంలో   తెలుగు భాషకు సంబంధించి, నీతిని బోధించే కథలతో, విజ్ఞానదాయకమైన కథలతో, ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రణతో - ఇలా పలురకాల పుస్తకాలు ఉండేవి. ప్రతివారం అందరికీ గ్రంథాలయంలో ఒక పీరియడ్‌ గడిపే అవకాశం ఉండేది.    


1976 ప్రాంతాల్లో  ఉక్కుపిడి మాయావి, సర్ప ద్వీపం వంటి పుస్తకాలు వచ్చాయి. అందులో హీరో క్లిష్టమైన పరిస్థితుల్లో మాయమైపోతాడు. అతని ఉక్కు చెయ్యి మాత్రం కనిపిస్తుంది. సరదాగా ఉండేది. అది ఫిక్షనని తెలుసు. కానీ, అది అసాధ్యం కాదేమోనని కూడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.  

 

1978లో  బిఎస్సీలో చేరడం, అందులో భౌతిక, రసాయన శాస్త్రాలను చదవడం, తరచూ ప్రాక్టికల్స్‌ చేయడంతో కొంత సైన్స్‌ పట్ల అవగాహన వచ్చింది. అప్పట్లో,   శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్ర విభాగాలు ఎంతో చురుగ్గా పనిచేసేవి. ఆయా విభాగాల వారు   ఏడాదికొకసారో, రెండేళ్లకొకసారో సైన్సు ప్రదర్శనలు జరిపేవారు.  ఎమ్మెస్సీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పోటీపడి రకరకాల నమూనాలను రూపొందించి ప్రదర్శించేవారు.   నీటితో కాగితంపై రాసిన అక్షరాలను దీపకాంతిలో చూపడం, విబూది రాల్బడం, నిప్పులేకుండా పొగను తెప్పించడం - ఇలాంటి గమ్మత్తులెన్నో    స్వయంగా లాబొరెటరీలలో చేయడం  చూశాను. వాటి వెనకాల ఉండే రహస్యాలేంటి, వాటిని గురించి చెప్పమని అడిగినపుడు మా రెండో అన్న, వారి  మాకేమీ చెప్పకుండా దాటేసేవారు.       

 

1981లో ఆపరేషన్స్‌ రిసెర్చి రంగంలో కర్నూలు పీజీసెంటరులో ఎంఎస్సీ  చేసి, తిరుపతిలో ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంఫిల్‌ చేశాను.   ఎంటెక్‌ విద్యార్థులకు సంవత్సరం పాటు బోధించాను. ఎంఫిల్‌ పూర్తి చేశాను.  ఇంతలో ఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థయిన నేషనల్‌ ఇన్ఫార్మటిక్స్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ రంగంలో ఉద్యోగావకాశం వచ్చింది. చేరిపోయాను.  ఆ తర్వాత 1998 నాటికి పిహెచ్‌ డి పూర్తి చేశాను. ఢిల్లీలో ఉండినపుడు, నేను ఖాళీ దొరికినపుడెల్లా, పలు సైన్సు సంబంధమైన కార్యక్రమాలు హాజరయ్యాను. పలు పరిశోధనాలయాలు చూశాను. మ్యూజియంలు చూశాను. ఐఐటికి వెళ్లే వాడిని కూడా. ఐఐటిలో చదివేవారు ఎందుకు ఇండియాలో ఉండటం లేదనే ఆలోచన నా బుర్రలో అలాగే తొలుస్తూ ఉండేది. మా అన్నతోటి మిత్రులతో కలిగిన పరిచయం కూడా నాకు బాగా వినియోగించింది. వారు చేస్తున్న పరిశోధనలను స్వయంగా చూశాక, అవకాశం ఇస్తే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మన మేధస్సుకెంతో అవకాశం ఉంది.  భారతదేశంలో విజ్ఞానశాస్త్ర రంగంలో జరుగుతున్న విశేషాలను అందరికీ తెలియజేయాలనిపించేది. మెయిన్ ఫ్రేం కంప్యూటర్లనుంచి, నేటి పామ్ టాప్ కంప్యూటర్ల దాకా సాంకేతికాభివృద్ధిని స్వయంగా చూశాను.  అటు రచయితల కుటుంబ నేపథ్యం, ఇటు విజ్ఞానరంగం పరిచయం, అనుభవం -- ఈ రెండూ సైన్సు రచనలు చేయడానికి నాకు సహజంగా అబ్బినాయి. 1998 దాకా అవకాశాలు రాలేదు.

 

ఢిల్లీలో మహీధర నళినీమోహనరావుగారిని ఎన్నోసార్లు కలిశాను.  సైన్సు వ్యాసాలు రాయడంలో నాకు ఎన్నో విషయాలు చెప్పేవారయన.   మా కార్యాలయంలోని గ్రంథాలయంలో కూడా సైన్సు పత్రికలూ, పుస్తకాలూ చాలా ఉండేవి. వాటితో రోజు కనీసం ఒక గంట గడిపేవాడిని.   నిజానికి ఢిల్లీనుంచి హైదరాబాదుకు వచ్చినపుడు రచనలపై నాకంత ఆసక్తి లేదు. కానీ, నాకు సైన్సెనా, సాంఘికమైనా సూటిగా, సులభంగా ఎవరూ చెప్పట్లేదేంటనే వేదన ఉండేది. అందరికీసులభంగా అర్ధమయ్యేలా సైన్సు కబుర్లు ఎవరూ ఎదుకు రాయట్లేదూ అని అనుకుంటూ ఉండే  నాకు 1998లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో  రాసే  చక్కని అవకాశం వచ్చింది. 1998-99లో రెండేళ్ల కాలంపాటు రాసి, విజయవంతంగా  నేనూ సైన్సు రచయితనే అనిపించింది నా కంప్యూటర్‌ క్లాస్‌ శీర్షిక వ్యాసాలు. దానికి తోడుగా నాకు కార్టూనిస్ట్‌ గా సహజంగా ఉన్న హాస్య గుణం తోడవడంతో వారంవారం కంప్యూటర్‌ పూర్వాపరాలూ, ప్రాథమిక విజ్ఞానంపై అవగాహనా కల్పిస్తూ చాలా సరదాగా రూపొందింది. ప్రతి వారం ఒక వ్యాసం, ఒక జోకు, ఒక కార్టూన్‌, ఒక సామెత, ఒక తాజా వార్త -- అన్నీ కంప్యూటర్‌ సైన్సు పరమైనవే అందించాను. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఎడిటరు ప్రోత్సాహంతో సైన్స్‌ పరమైన ప్రత్యేక కథనాలు, సైన్స్‌ క్లబ్‌ అనే శీర్షికన ఏడాదిపైనే వివిధ సైన్సు వ్యాసాలూ అందించాను.  1999 ప్రాంతాల్లో, నాకు శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్‌, శ్రీ బి.మల్లిక్‌, శ్రీపాండయ్య గారలు  కంప్యూటర్‌ అక్షరాస్యతా కేంద్రం అనే దాన్ని ప్రారంభించినపుడు వారు ప్రోత్సాహించగా, నేను ట్రైనర్స్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చాను. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టంలతో పనిచేయడం గురించి నోట్సు కూడా తెలుగులో రాసి ఇచ్చాను.   అలా వారితో కలిగిన పరిచయం, నాతో తెలుగు అకాడమీకి 5 పుస్తకాలను రాయించింది. అన్నీ కంప్యూటర్‌ సైన్సు సంబంధించినవే.  ఆ తర్వాత కంప్యూటర్‌ శాస్త్ర నిఘంటువును ఒంటికాలిమీద నిలబడి పూర్తి చేశాను.

 

ఆ సమయంలో ఆంధ్రప్రభ ప్రత్యేక సంపుటాలు తెచ్చింది. వాటికోసం ఐటి ఉద్యోగాలు, ఇంటర్నెట్‌ వాడటానికి మార్గాలు - ఇలా రకరకాల వ్యాసాలు రాసి ఇచ్చాను. ఒక ఏడాది పాటు విండోస్‌ ఎలా వాడుకోవచ్చో, ఆదివారం అనుబంధంలో రాశాను.   రెండేళ్లపాటు నాకు వారంవారం ఒక పేజీ అరచేతిలో ఐటీ ప్రపంచాన్ని చూపించేలా కంప్యూటర్‌ వ్యాసాలు రాశాను.  2003లో కంప్యూటర్‌ విజ్ఞానం అనే మాసపత్రికలో  వివిధ కంప్యూటర్‌ అంశాలపైకవర్‌ స్టోరీలను  అందిస్తూ,  మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాల పాటు వారికి రాశాను.   తరవాత ఆంధ్రభూమి డైలీలో యువ  టాబ్లాయిడ్‌ లో రెండేళ్లు నేను ఐటి పేజీ నిర్వహించాను. ఎన్నో సైన్సు అంశాలపై కవర్‌ స్టోరీలనూ రాశాను.   పెద్దల కోసం నేను రాసిన కంప్యూటర్‌ కబుర్లు కూడా బాగా పాపులరైంది.

 

ఈ రచనా వ్యాసాంగంతో పాటు నేను ఆకాశవాణిలో కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్ అంశాలకు సంబంధించి అనేక ప్రసంగాలు చేశాను. అప్పటికే కొన్ని వందల సైన్సు వ్యాసాలు రాయడం వల్ల, నాకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని ఏర్పర్చుకున్నాను. 2001ప్రాంతాల్లో  స్మార్ట్‌హోం అనే నా ప్రసంగం ఎన్నోసార్లు   ప్రసారమైంది.   


2007లో ఒక రోజు ఆకాశవాణికి  2 సైన్సు రూపకాలను రాయాలని కబురందింది. ముఖ్యంగా చంద్రుడిమీద జరిగినన్ని ప్రయోగాలు వేరే ఏ గ్రహం మీద జరగలేదు. కమ్యూనికేషన్స్‌ రంగంలో విప్లవాత్మకమార్చులు వచ్చాయి. సైన్సు ఎలాంటి విజయాలను సాధించిందో తెలపడం కూడా ముఖ్యం. అలాగే, అంతరిక్షయాత్రలు ఎన్నో జరిగాయి.  భారతదేశం కూడా ఏమాత్రం తీసిపోని విధంగా వైజ్ఞానిక జైత్రయాత్రలు చేసింది. వీటన్నిటినీ చేయాలంటే 2 రూపకాలు కాదు. కనీసం 5,6 రూపకాలు అవుతాయి అంటూ చెప్పేసరికి అంగీకరించి ౩౦ నిమిషాలనిడివి గల 5 రూపకాలు చేయమని చెప్పారు.  ఐఐటి బ్రెయిన్‌ డ్రైన్‌ లాంటి అంశాలనీ వాటిలో జొప్పించాను. విదేశాలనుంచి ఇండియాకు వచ్చిన పరిశోధక విద్యార్థి పాత్రను ఒక రూపకంలో పెట్టాను.  ఈ రూపకాలు రాయడంలో   దాదాపు మూడునెలలపాటు విషయసేకరణపైనే దృష్టి పెట్టాను. ఎందరెందరో శాస్త్రవేత్తలతో, ఇంజనీర్లతో మాట్లాడాను.  ఎందుకంటే,  సమాచారం పోగేయడం ఒక ఎత్తు దానిని చదివి అర్థం చేసుకోవడం మరో ఎత్తు. అందుకే, సైన్సు రాసే రచయితలకి చాలా ఓపిక కావాలి. ఆమూలాగ్రం చదివి, ఎంత వరకు పాఠకులకు, శ్రోతలకు అర్ధమవుతుందో అంత మటుకే ఇవ్వాలి. అలాగే, మనం రాసే మాధ్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  

 

సైన్సు రచనలు చేయగలిగినవాడు ఏ రకమైన రచనలైనా చేయగలడనేది కొందరికే తెలుసు. అలాగే,  సైన్సు, ఆధ్యాత్మికతనుంచే వచ్చిందని నానమ్మకం. ఎందుకు, ఏమిటి, ఎలా - అని పరిప్రశ్న చేయడం ఆధ్యాత్మికతే నేర్పుతుంది. దానికి రీజనింగ్‌ తో, సరైన ఆధారాలతో సరైన సమాధానాన్ని సైన్సు అందిస్తుంది. అందువల్ల మనం చెప్పదలుచుకుంది క్లుప్తంగానైనా సరే, వివరంగానైనా సరే, సూటిగా చెప్పాలి. జనం కోరేది మనం చెప్పగలగాలి. మనం చెప్పేదే జనం వింటారపుడు. దానికి సరైన భాష వాడాలి. మన వ్యక్తీకరణలో స్పష్టత ఉండాలి. అపుడు పాఠకుడే మన రచనల కోసం ఎదురుచూస్తాడు.

 

ప్రాచీన కాలం నాటికే మన భారత దేశంలో సైన్సు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలియజెప్పాలని ఉంది. దానికి ముందుగా, మనం నేడు ఆధునికత పేరుతో చూసే సైన్సుకు మూలాలు ఆధ్యాత్మికతలోనే ఉందని తెలుసుకున్నాను. అందుకే ఆధ్యాత్మిక రచనలూ చేస్తున్నాను. ఆధార, ప్రణాళికబద్ధమైన, ప్రామాణికమైన ఆధ్యాత్మికతే సైన్సు. దీనిని మానవాళి సంక్షేమానికే వాడాలి అని మనం అందరూ తెలుసుకోవాలి. అలాగే, మన ప్రాచీనమైన భారతీయ పరిజ్ఞానం, విజ్ఞానం అపారం. వాటిని నేటి కాలానికి అనుగుణంగా చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎందుకంటే, నేడు సైన్సు పేరిట ప్రయోగాలు చేస్తూ ప్రకృతితో మనిషి ఆడుకొంటున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నాడు. అందువల్లే ప్రకృతి కూడా మనుషులతో ఆడుకొంటూంది. అందరూ ఇది తెలిసి మసలుకోవాలి. ఏం చేస్తే మానవాళి సంక్షేమంగా ఉంటుందో అందరికీ తెలియజెప్పే రచనలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.

***


Friday, October 15, 2021

 ముందస్తుగా.....


మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.....


2018 నుంచి మీకు నేను నా నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాను.  కారణాలు ఎన్నో.... కర్ణుడి  మరణానికి కారణాలెన్నో అన్నట్టు....  

2021 జూలై 31 నుంచి నరకాసుర చెర నుంచీ,  నరకసంస్థానపు కాకాసురుల కబంధహస్తాలనించీ విడుదల కావడంతో కొంత ఊరట కలిగింది.

ఎండిపోయిన కళ్లు, ఖాళీ అయిన మెదడు, నిస్సారంగా ఉండే జీవనయానం - ఇవీ నా నిశ్సబ్దాన్ని నియంత్రిస్తున్నాయింకా. ఈ విజయదశమి రోజున కనీసం బ్లాగ్ ను చురుకుగా ఉంచుదామని నిర్ణయం తీసుకొన్నాను,

చూద్దాం మళ్లీ రాయగలనేమో....